ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం బాకా, కత్తి వంటి వాటిని ఎన్నికల గుర్తులుగా ఎంచుకున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం (ఈసీ)కి చిహ్నాల జాబితాను సోమవారం సమర్పించింది. బాకా, మొద్దుబారిన చిట్టడవి, కత్తి వంటి వాటిని తమ వర్గం చిహ్నంగా పరిగణించాలని అందులో కోరింది. బీజేపీ మద్దతులో శివసేనకు ఎదురుతిరిగిన ఏక్నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతులో మహారాష్ట్ర సీఎం అయ్యారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తన ఉనికి కోసం న్యాయ పోరాటం చేస్తున్నది.
మరోవైపు అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనున్నది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు, బాణం ఎన్నికల చిహ్నాన్ని ఈసీ స్థంభింపజేసింది. అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నంతోపాటు పార్టీ పేర్లను సమర్పించాలని శివసేన రెండు వర్గాలకు సూచించింది.
కాగా, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కూడా తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లను ప్రస్తావించింది. ఎంచుకున్న గుర్తుల్లో త్రిశూలం, ఉదయించే సూర్యుడు, కాగడా ఉన్నాయి. శివసేన (బాలాసాహెబ్ ఠాక్రే), శివసేన (ప్రబోధంకర్ ఠాక్రే), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లను పార్టీ పేర్లుగా పేర్కొంది. జాబితాలోని మూడు గుర్తుల్లో ఏ గుర్తు ఇచ్చినా, మూడు పార్టీ పేర్లలో ఏ పేరు ఖరారు చేసినా తమకు సమ్మతమేనని ఉద్ధవ్ ఠాక్రే వర్గం పేర్కొంది.