తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ సోమవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కేటీ జలీల్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. బంగారం అక్రమ రవాణా కేసులో స్వప్నా సురేశ్ తనపై చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని, తనపై కుట్ర పన్నడంతో పాటు పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ జలీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరువనంతపురం కంటోన్మెంట్ పోలీసులు స్వప్నా సురేష్పై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 23న స్వప్నా సురేష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బంగారం స్మగ్లింగ్ కేసుకు సంబంధించి.. దాదాపు ఐదున్నర గంటల పాటలు విచారించింది. అంతకు ముందు రోజు సైతం ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో కేరళ ముఖ్యమంతి పినయి విజయన్తో పాటు ఆయన కుటుంబంపై స్వప్నా సురేష్ ఆరోపణలు చేయగా.. వివాదాస్పదమయ్యాయి. దీంతో సీఎం రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో విజయన్, ఆయన భార్య, కుమార్తె ప్రమేయంపై తాను కోర్టులో వెల్లడించినట్లు సురేష్ వెల్లడించిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. దౌత్య మార్గాల ద్వారా తరలిస్తుండగా కస్టమ్స్ తనిఖీలు చేయడంతో 2019లో వెలుగులోకి వచ్చింది.