కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఎంసీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు. దీదీ కనుసన్నల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచేసిందని ఆరోపించారు.
టీఎంసీ గూండాలను కాపాడాలని సీఎం మమతా బెనర్జీ కోల్కతా పోలీసులుక ఆదేశాలు జారీ చేశారని అన్నారు. తృణమూల్ కార్యకర్తలు రిగ్గింగ్కు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తరహాలో దీదీ వ్యవహరించారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని గవర్నర్ జగ్ధీప్ ధంకర్ను కలిసిన అనంతరం సువేందు అధికారి మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
కేంద్ర బలగాలు అవసరం లేదని, కోల్కతా పోలీసులు సరిపోతారని చెప్పిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ టీఎంసీ అక్రమాలపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పేరుతో పోలింగ్ ప్రక్రియను అపహాస్యం చేశారని అన్నారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఎంసీ గూండాలు సీసీటీవీలను ధ్వంసం చేసి బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారని, బాంబులతో స్వైరవిహారం చేశారని సువేంధు అధికారి ఆరోపించారు.