కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్సెస్సీ) కేసులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమంగా ఉపాధ్యాయులను నియమించాలని బీజేపీ నేతలు సువేందు అధికారి, దిలీప్ ఘోష్, సీపీఎం నేత సుజన్ చక్రవర్తి తనకు కొందరి పేర్లను ప్రతిపాదించారని, ఇందుకు తాను నిరాకరించానని ఈ కేసులో నిందితుడిగా సీబీఐ కస్టడీలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత, మాజీ మంత్రి పార్థ ఛటర్జీ ఆరోపించారు.
తనను ఇప్పుడు విమర్శిస్తున్న వారు వారి విశ్వసనీయతను ఒకసారి చూసుకోవాలని ఆయన సూచించారు. అయితే, పార్థ ఛటర్జీ ఆరోపణలను బీజేపీ, సీపీఎం నేతలు ఖండించారు.