న్యూఢిల్లీ, జనవరి 28: పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జూలై 2021 సమావేశాల వరకే వారిపై చర్యలను తీసుకోవాలని, సెషన్ను దాటి ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ను కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది సహేతుకమైన చర్య కాదని పేర్కొంది. స్పీకర్ ఇచ్చిన సస్పెన్షన్ ఆదేశాలను పక్కనబెట్టింది. సభా కార్యకలాపాలకు అడ్డుపడుతూ, గందరగోళం సృష్టిస్తున్నారన్న కారణంతో గత వర్షకాల సమావేశాల్లో బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఏడాది సస్పెండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు.