Loksabha Elections 2024 : అమేథి, రాయ్బరేలి స్ధానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధులపై సస్పెన్స్ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ రెండు స్ధానాల్లో ఓ స్ధానం నుంచి పోటీ చేసేందుకు రాహుల్ సుముఖంగా ఉన్నా, ప్రియాంక గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు.
ఈ రెండు చోట్ల రాహుల్, ప్రియాంకలు పోటీ చేయాలని ఖర్గే సూచించినా క్షేత్రస్ధాయి పరిస్ధితుల ఆధారంగా తుది నిర్ణయాన్ని వారికే వదిలివేశారు. ఇక ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణుల నుంచి ఎంతటి ఒత్తిడి ఎదురైనా పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అమేథి, రాయ్బరేలి నుంచి పోటీకి దిగాలా లేదా అనే విషయంలో తమ నిర్ణయాన్ని వారిద్దరూ గురువారం రాత్రి ఖర్గేకు తెలియచేయవచ్చని భావిస్తున్నారు.
ఈ రెండు స్ధానాల్లో నామినేషన్ దాఖలుకు శుక్రవారం తుది గడువు కావడం గమనార్హం. దశాబ్ధాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా పేరొందిన ఈ రెండు స్దానాల నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేయకుంటే పార్టీ కార్యకర్తలకే కాకుండా విపక్షాలతో పాటు పాలక కూటమి, ఓటర్లకూ తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుందని ఖర్గే వారికి నచ్చచెబుతున్నట్టు సమాచారం. ఇక కర్నాటకలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఈ రెండు స్ధానాలపై అభ్యర్ధులను ఎంపిక చేసే బాధ్యతను ఖర్గేకు కట్టబెట్టినట్టు తెలిసింది.
Read More :