రాంచి: పని మనిషిని మానసికంగా, శారీరకంగా హింసించి చిత్రవధకు గురిచేసిన బహిష్కృత బీజేపీ నాయకురాలు సీమా పాత్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఇంట్లో పనిచేసే మహిళను సీమాపాత్ర చిత్రహింసలు పెట్టింది. అన్నం పెట్టకుండా రోజుల తరబడి పస్తులు ఉంచింది. ఇనుప రాడ్డుతో కొట్టి పండ్లు విరగగొట్టింది.
ఫ్లోర్ మీద పడిన మూత్రాన్ని నాకించింది. తల్లి పనిమనిషిని హింసించడం చూసిన సీమాపాత్ర కొడుకు ఆయుష్మాన్ తట్టుకోలేకపోయాడు. విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగి అయిన తన స్నేహితుడికి చెప్పి సాయం కోరాడు. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గత వారం బాధితురాలిని విడిపించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇవాళ సీమాపాత్రను అదుపులోకి తీసుకున్నారు.
కాగా, సీమాపాత్ర మాత్రం తనకు ఏ పాపం తెలియదని అంటోంది. తాను అమాయకురాలినని, తనకు ఏమీ తెలియదని, తనంటే గిట్టని వాళ్లు కుట్ర చేసి తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న సమయంలో సీమాపాత్ర మీడియాకు చెప్పింది. సీమాపాత్ర బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసేది. ఆమె భర్త మహేశ్వర్ పాత్ర రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. బాధితురాలు సునీత వాళ్ల ఇంట్లో గత పదేండ్లుగా పనిచేస్తున్నది.