శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో గురువారం రాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి. మూడు ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించేసరికి భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మొదటి డ్రోన్ను బారి బ్రహ్మ ఏరియాలో గుర్తించగా, చలియారి వద్ద రెండో డ్రోన్ను గుర్తించారు. పఠాన్కోట్ జాతీయ రహదారికి సమీపంలోని గగ్వాల్ ఏరియాలో మూడో డ్రోన్ను గుర్తించినట్లు బలగాలు పేర్కొన్నాయి. దీంతో బలగాలు అప్రమత్తమై.. ఆ మూడు ప్రాంతాల్లో డ్రోన్లు ఏమైనా వదిలి వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో ఆ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే డ్రోన్లపై బీఎస్ఎఫ్ బలగాలు నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపేసరికి అవి కనిపించకుండా పోయాయి. మొత్తంగా సాంబా జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.