న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తితో గత రెండేండ్ల నుంచి కూరగాయల ధరలు కొండెక్కడంతో ఏం తిని బతకాలో తెలియని పరిస్ధితుల్లో సామాన్యుడు సతమతమవుతున్నాడు. కూరగాయల ధరలు భారమవడంతో గత రెండేండ్లుగా వీటి కొనుగోలుపై నెలకు 25 నుంచి 100 శాతం వరకూ అదనంగా వెచ్చించాల్సి వస్తోందని 76 శాతం మంది గృహస్తులు వెల్లడించారు. ప్రముఖ కమ్యూనిటీ సోషల్ మీడియా వేదిక లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ధరల పెంపుపై షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి.
ధరల పెరుగుదలతో ఈ ఏడాది కిలో టమాటపై రూ 50, ఉల్లిగడ్డలకు రూ 30, ఆలుకు కిలోకి రూ 25 చొప్పున అధికంగా వెచ్చించాల్సి వచ్చిందని ఇద్దరు గృహస్తుల్లో ఒకరు వెల్లడించారని సర్వే తెలిపింది. ఇక 36 శాతం వినియోగదారులు కూరగాయలు కొనేందుకు 25 నుంచి 50 శాతం అధికంగా ఖర్చు చేస్తున్నారని, 31 శాతం మంది కూరగాయలపై ఖర్చు ఏకంగా 50 శాతం నుంచి రెట్టింపు కూడా అయిందని వెల్లడించారు.
స్ధానికంగా పండే కూరగాయలు మినహా దూర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయల ధరలు మండిపోతున్నాయని వినియోగదారులు చెప్పుకొచ్చారు. ఇక సెప్టెంబర్లో ఆహార ద్రవ్యోల్బణం 8.60 శాతానికి ఎగబాకగా అక్టోబర్లో మరింత పెరగడంతో కూరగాయలు, పండ్లు సహా ఆహారోత్పత్తుల ధరలు అనూహ్యంగా పెరిగాయి.