న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాల కేసులో మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఇటీవల నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేయటంపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విడుదలైన మరో ఐదుగురికి భారీ ఊరట లభించినట్టయ్యింది.
రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను పరిశీలించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సహేతుకమైనవని తేల్చి చెప్పింది. అయినా ప్రభుత్వ అప్పీలును విచారణకు స్వీకరిస్తున్నామని పేర్కొన్నది. స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు విజ్ఞప్తి చేశారు.
ఆయన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. తీర్పును వెనక్కి తీసుకోవటంలో తొందరపాటు కూడదని హితవు పలికింది. తీర్పు హేతుబద్ధంగా లేనిపక్షంలో పరిగణనలోకి తీసుకునే వారమని వెల్లడించింది. నిర్ణీత సమయంలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుందని స్పష్టం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో 2014లో ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.