Supreme Court | కోర్టుల్లో విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారులను ఏకపక్షంగా పిలిపించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ పిటిషన్పై బుధవారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. అధికారులను ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) జారీ చేయనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ అధికారులను ఏకపక్షంగా పిలిచే ధోరణికి కోర్టులు దూరంగా ఉండాలని ధర్మాసనం సూచించింది.
కేసు విచారణ సందర్భంగా తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారుల అభిప్రాయం, న్యాయస్థానాల అభిప్రాయాలు వేరుగా ఉంటాయని అభిప్రాయపడింది. న్యాయస్థానం ఏకపక్షంగా అధికారులను పిలిపించాలని అనడం లేదని అన్నారు. కోర్టులు విచారణ సమయంలో అధికారులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ధర్మాసనం సూచించింది. ఉత్తరప్రదేశ్ ఆర్థిక శాఖకు చెందిన ఇద్దరు కార్యదర్శులపై అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వ అధికారుల సమన్లకు సంబంధించి కోర్టులు అనుసరించాల్సిన విస్తృత మార్గదర్శకాలను నిర్ణయిస్తామని ధర్మాసనం ఇంతకు ముందు విచారణ సందర్భంగా తెలిపింది.