Supreme Court | బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS)- 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) -2023, భారతీయ సాక్ష్య చట్టం–2023 బిల్లులను తీసుకువచ్చింది. లోక్సభ, రాజ్యసభలో ఆమోదం అనంతరం గతేడాది డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్రవేయడంతో చట్టరూపం దాల్చాయి.
ఈ మూడు చట్టాలు ఈ ఏడాది జులై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. అయితే, ఈ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొత్త క్రిమినల్ చట్టాలను సవాల్ చేయడానికి మీరెవరు?’ అంటూ ప్రశ్నించారు. పిటిషన్లో హోం, న్యాయమంత్రిత్వ శాఖలను పార్టీలుగా చేర్చాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
కొత్త క్రిమినల్ చట్టాల అమలులోకి రానుండడంతో భారీగా మార్పులు రానున్నాయి. హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇటీవల డ్రైవర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డ్రైవర్స్ యూనియన్తో చర్చించి చట్టంలు మార్పులు చేస్తామని హామీ ఇచ్చింది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ సెక్షన్ 106(2)ని ప్రస్తుతం అమలు చేయడం లేదని ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. ఇండియన్ జ్యుడీషియల్ కోడ్లో మొత్తం 358 సెక్షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులకు కొత్త చట్టాలపై శిక్షణ సైతం సాగుతున్నది.