‘మెయిన్స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో ఈ విద్వేష ప్రసంగాలపై ఎటువంటి నియంత్రణా లేదు. పత్రికా స్వేచ్ఛ ముఖ్యమే.. కానీ ఎక్కడ గీత గీయాలో మనకు తెలిసి ఉండాలి. ఒకరిని పలు విధాలుగా, కొద్ది కొద్దిగా హత్యచేసినట్టు విద్వేష ప్రసంగాలు సాగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం మౌనం వహించకుండా కోర్టుకు సహకరించాలి. ఇదేమైనా పనికిమాలిన అంశమా?’
– జస్టిస్ కేఎం జోసెఫ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విద్వేష ప్రచారం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం మౌనసాక్షిగా ఉండిపోవడం ఏమిటని సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. లా కమిషన్ సిఫారసు మేరకు ఈ అంశంపై చట్టాన్ని తెచ్చే ఆలోచన ఉన్నదా? అని ప్రశ్నించింది. పెచ్చరిల్లి పోతున్న విద్వేష ప్రచారాన్ని నివారించాలని దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్వేష ప్రచారాన్ని నియంత్రించేందుకు సంస్థాపరమైన యంత్రాంగం అవసరమని స్పష్టం చేసింది. తమ కార్యక్రమాలు విద్వేష ఉపన్యాసాల ఘోషగా దిగజారకుండా చూసుకోవడంలో టీవీ యాంకర్ల పాత్ర కీలకమని పేర్కొన్నది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలోని అంశాలు చాలావరకు అనియంత్రితంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. టీవీలో విద్వేష ప్రచారం జరగకుండా చూడాల్సిన బాధ్యత యాంకర్లదేనని నొక్కిచెప్పింది. ‘గాలిలోకి విద్వేషాన్ని ఎక్కించడం తగదని’ హితవు చెప్పింది. ‘మెయిన్స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలో ఈ విద్వేష ప్రసంగాలపై ఎటువంటి నియంత్రణా లేదు.
టీవీ చర్చల్లో ఎవరైనా ఇతరులను దూషిస్తూ మాట్లాడుతుంటే.. వారిని ఆపవలసిన బాధ్యత యాంకర్లదే. పత్రికా స్వేచ్ఛ ముఖ్యమే.. అమెరికాలో ఉన్నంత స్వేచ్ఛ ఇక్కడ లేకపోవచ్చు. కానీ ఎక్కడ గీత గీయాలో మనకు తెలిసి ఉండాలి. ఒకరిని పలు విధాలుగా, కొద్ది కొద్దిగా హత్యచేసినట్టు విద్వేష ప్రసంగాలు సాగుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం మౌనం వహించకుండా కోర్టుకు సహకరించాలి. ఇదేమైనా పనికిమాలిన అంశమా?’ అని జస్టిస్ కేఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు. ప్రధాన చానెళ్ల హవా ఇంకా నడుస్తున్నదని, విద్వేష ప్రచారానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి గొంతు నొక్కేస్తున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. విద్వేష ప్రచార సమస్యను ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన విధానం అవసరమని, మనదేశం జవాబుదారీతనతంతో కూడిన బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యంగా మనుగడ సాగించాల్సి ఉందని గుర్తు చేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రభుత్వం మౌనసాక్షిలా ఉండిపోవడమేమిటని ప్రశ్నించింది. చట్టం తెచ్చే ఉద్దేశం ఉందా? అని నిలదీసింది. తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేసింది.