Same-Sex Marriage | స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. వేసవి సెలవుల తర్వాత జులైలో కోర్టు తీర్పును వెలువరించే అవకాశాలున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు. పదిరోజుల పాటు సుప్రీంకోర్టు ఆయా పిటిషన్లపై పిటిషనర్లతో పాటు కేంద్రం వాదనలు విన్నది.
అయితే, ప్రత్యేక వివాహ చట్టం 1954లోని నిబంధనను ‘వ్యక్తుల’ మధ్య వివాహం అని అర్థం కాకుండా పురుషుడు – స్త్రీ మధ్య వివాహం అని అర్థం చేసుకోవాలని కోర్టును పిటిషనర్లు కోరారు. అయితే, స్వలింగ వివాహాలను చట్టబద్ధత కోర్టు పరిధిలో లేదని, రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకున్న అనంతరం పార్లమెంట్లో చట్టం చేయాలని కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. బుధవారం విచారణ సందర్భంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు లేదని, భిన్న లింగ వివాహాలు మాత్రమే పిల్లలకు స్థిరత్వాన్ని కల్పిస్తాయని కోర్టుకు తెలిపింది. అయితే, పిటిషనర్లు స్వలింగ వివాహాలను గుర్తించాలని, తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్) పౌరులకు సైతం వర్తిస్తుందని వాదించారు.
అయితే, ఆయా పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది. ఒకే లింగానికి చెందిన వ్యక్తులు భాగస్వాములుగా కలిసి జీవించడం, లైంగిక సంబంధాలు కలిగి ఉండడం భారతీయ కుటుంబ యూనిట్ భావనతో పోల్చతగినది కాదని కేంద్రం అఫిడవిట్లో స్పష్టం చేసింది. కేంద్రంతో పాటు ఇస్లామిక్ మత సంస్థ జమియాత్ ఉలమా ఐ హింద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వలింగ వివాహాలు పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చాయని, వాటిని అనుమతించకూడదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. స్వలింగ సంపర్కులకు వివాహాల విషయంలో గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను కోరిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్రాలు వ్యతిరేకించగా.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు మరింత సమయం కావాలని కోరాయి.