న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఇటీవల నోటిఫై చేసిన ‘పౌరసత్వ సవరణ చట్టం (CAA)’ అమలుపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఆ పిటిషన్లపై మార్చి 19న విచారణ జరపనున్నట్లు శుక్రవారం వెల్లడించింది. సీఏఏ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఆ చట్టం అమలును నిలిపివేయాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఇటీవల అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల తదితర పొరుగు దేశాల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏను) తీసుకొచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవలే ఆ చట్టాన్ని నోటిఫై చేసింది. అయితే దానిపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమైందంటూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ చట్టం అమలును నిలిపివేయాలని తన పిటిషన్లో పేర్కొంది. అలాగే అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. ‘మంగళవారం దీనిపై వాదనలు వింటాం. మొత్తం 190కి పైగా కేసులు ఉన్నాయి. అన్నింటినీ విచారిస్తాం’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు తెలిపారు.