Supreme Court | న్యాయమూర్తిపై అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సోషల్ మీడియాను ఉపయోగించి న్యాయ అధికారుల పరువు తీస్తుంటే ఊరుకోలేమని స్పష్టం చేసింది. జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు పది రోజుల జైలుశిక్ష విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో జోక్యం చేసుకోదల్చుకోలేదని జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన వెకేషన్ బెంచ్ చెప్పింది.
ఇది ఇతరులకు గుణపాఠం కావాలని పేర్కొంది. జ్యుడీషియల్ అధికారిపై ఎలాంటి ఆరోపణ వచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండాల్సిందని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు. న్యాయశాఖ అధికారిని పరువు తీశారని, ఆయన ప్రతిష్టకు జరిగిన నష్టాన్ని గురించి ఆలోచించండంటూ సూచించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, మే 27కి ముందే దరఖాస్తుదారు జైలులో ఉన్నారని తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే.. జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసినందుకు కృష్ణ కుమార్ రఘువంశీపై క్రిమినల్ ధిక్కరణ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు పది రోజుల జైలు శిక్ష విధించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదే పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.