Supreme Court | ఎన్నికల్లో వీవీప్యాట్ మిషన్లలోని మొత్తం స్లిప్స్ను కౌంటింగ్ జరిగేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను వచ్చేవారం విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఏడీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను వచ్చే మంగళవారం లేదంటే బుధవారం రోజున లిస్ట్ చేస్తామని జస్టిస్ సంజీవ్ కన్నా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం వెల్లడించింది. పిటిషనర్ ఏడీఆర్ తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ను త్వరగా విచారించాలని డిమాండ్ చేశారు.
వీవీప్యాట్లపై దాఖలో మరో పిటిషన్పై స్పందన కోరుతూ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ కోర్టుకు హాజరై, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, పిటిషన్పై విచారణ జరుగకపోతే పిటిషన్లు నిష్ఫలమవుతాయని తెలిపారు. బెంచ్లో జస్టిస్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేషన్, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు. బెంచ్ స్పందిస్తూ ‘పరిస్థితి తమకు తెలుసు. వచ్చేవారం విచారణ చేపడుతాం’ అని పేర్కొంది.
ఏడీఆర్ పిటిషన్పై గత ఏడాది జులై 17న సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ స్పందన కోరింది. ఓటర్లు వేసిన ఓటును వీవీప్యాట్ మిషన్ ద్వారా నిర్ధారించుకునేలా ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడీఆర్ పిటిషన్లో కోరింది. వీవీప్యాట్ స్లిప్స్ను ఈవీఎం మెషిన్తో సరిపోల్చాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్ల ధ్రువీకరించే విధానం కొనసాగుతున్నది.