Supreme Court | జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హోదా అంశంపై దాఖలైన పిటిషన్లపై స్పందన చెప్పాలంటూ కేంద్రానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లను విచారించింది. విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక కార్యకర్త అహ్మద్ మాలిక్తో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. 2023 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు త్వరగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని పిటిషనర్లు కోరారు.
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2024 సెప్టెంబర్ 30 నాటికి జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, త్వరలో రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని పునరుద్ధరించాలని ఆ సమయంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్కు ముందస్తు రాష్ట్ర హోదా రాజ్యాంగపరమైన అవసరమని ఇర్ఫాన్ హఫీజ్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పిటిషన్లో వాది అయిన ఇర్ఫాన్ హఫీజ్ లోన్.. సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గతంలో 2024 సెప్టెంబర్ నాటికి జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని, త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని ఆదేశించిందని తెలిపారు.
రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర హోదాను నిర్దిష్ట కాలపరిమితితో పునరుద్ధరించాలని కోర్టుకు ఒక ప్రతిపాదనను సమర్పించారు. జమ్మూ కశ్మీర్ మంత్రివర్గం ఆమోదించిన ఈ ప్రతిపాదన కాపీని కోర్టుకు సమర్పించామని ఆయన తెలిపారు. కేంద్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ఈ అంశంపై జమ్మూ కశ్మీర్ పరిపాలనతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి అని, ఇందులో అనేక సున్నితమైన అంశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కేంద్రపాలిత ప్రాంతాన్ని ప్రతికూల కోణంలో చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.