న్యూఢిల్లీ, అక్టోబర్ 13: అదానీ పోర్ట్స్ స్పెషనల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గుజరాత్లోని ఏపీసెజ్లో గిడ్డంగి నిర్వహణకు కేంద్ర గిడ్డంగి కార్పొరేషన్(సీడబ్ల్యూసీ)కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఏపీసెజ్కు అనుకూలంగా గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, కీలక నిర్ణయం తీసుకొన్నది. అసలేం జరిగిందంటే.. ఏపీ సెజ్లో 34 ఎకరాల్లో సీడబ్ల్యూసీ రెండు గిడ్డంగులను నిర్వహిస్తున్నది.
ఆ గిడ్డంగులను నిర్వహించుకోవాలంటే ఏపీసెజ్ నుంచి అనుమతి తీసుకోవాలని లేదా ఖాళీ చేసి వెళ్లిపోవాలని సీడబ్ల్యూసీని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ సీడబ్ల్యూసీ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సీటీ రవికుమార్.. గుజరాత్ హైకోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తీర్పును కొట్టివేస్తూ, సీడబ్ల్యూసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ గిడ్డంగులను నిర్వహించుకోవటానికి అనుమతి ఇచ్చారు.