న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మథుర ఆలయ సమీపంలోనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమతిని నిలిపి వేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
మథురలో శ్రీకృష్ణుడు పుట్టిన స్థలంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన అలహాబాద్ హైకోర్టు.. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించాలని ఆదేశించింది. దాని పర్యవేక్షణకు అడ్వకేట్ కమిషనర్ నియామకానికి అనుమతి ఇచ్చింది. తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం కమిటీ సుప్రీంను ఆశ్రయించగా ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. దీనిపై మీ స్పందన తెలియజేయాలంటూ హిందూ సంస్థలకు నోటీసులులిచ్చింది.