Supreme Court : దేశంలో ట్రయిల్ కోర్టుల (Trial courts) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. చాలా సాధారణ కేసుల్లో కూడా దర్యాప్తు పూర్తయినప్పటికీ ట్రయల్ కోర్టులు బెయిల్ పిటిషన్లను (Bail pleas) తిరస్కరించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ప్రజాస్వామ్య దేశంలో పోలీసుల రాజ్యంలోలా పని చేయకూదని సూచించింది. ఒక చిన్న కేసులో బెయిల్ కోసం దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
‘ఒక ప్రజాస్వామ్య దేశంలో పోలీసుల రాజ్యంలోలా పని చేయకూడదు. చట్టం అమలుచేసే కొన్ని సంస్థలు నిజాలతో సంబంధం లేకుండా కొందరిని నిర్భందించేందుకు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తాయి. అలా చేయడం ఆమోదయోగ్యం కాదు. రెండు దశాబ్దాల క్రితం.. చిన్న కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చాలా అరుదుగా వచ్చేవి. ట్రయిల్ కోర్టు స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు ట్రయల్ కోర్టుల్లోనే పరిష్కారమయ్యేవి. ఇప్పుడు చిన్న కేసుల విషయంలో కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడమనేది దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనవసరంగా వ్యవస్థపై భారం పడుతోంది.’ అని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది.
ఒక చిన్న కేసులో రెండేళ్లకు పైగా కస్టడీలో ఉన్న నిందితుడికి సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయ్యి ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ నిందితుడి బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. మేజిస్ట్రేట్లు విచారించగలిగే కేసుల్లో బెయిల్ విషయాలను సుప్రీంకోర్టు ముందుకు తీసుకురావడం దురదృష్టకరమని అభయ్ ఎస్ ఓకా అసహనం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదని అన్నారు. చిన్నచిన్న నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేయడంలో ట్రయల్ కోర్టులు, హైకోర్టులు మరింత ఉదారవాద వైఖరితో వ్యవహరించాలని సూచించారు.