Supreme Court | ముంబై, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఫిబ్రవరి 15లోగా నిర్ణయం తీసుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు గడువు విధించింది. ఇంతకుముందు జనవరి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే కొద్ది రోజుల క్రితం వరకు స్పీకర్, శివసేన పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి బిజీగా ఉన్నందున ఎన్సీపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు మూడు వారాల సమయం అవసరమని స్పీకర్ కార్యాలయం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషన్ దాఖలు చేశారు. విచారణ ప్రక్రియ జనవరి 31తో ముగుస్తుందని తెలిపారు.
స్పీకర్కు మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై ఫిబ్రవరి 15లోగా తేల్చాలని తాజాగా ఆదేశించింది. 2022 మేలో శివసేనలో చీలిక ఏర్పడి ఆ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2023 జూలైలో ఎన్సీపీ నేత అజిత్ పవార్, తన పార్టీని చీల్చి 40 మంది ఎమ్మెల్యేలు, 5గురు ఎమ్మెల్సీలతో కలిసి షిండే క్యాబినెట్లో చేరి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు లేఖ అందజేశారు. అయితే స్పీకర్ పట్టించుకోక పోవడంతో శరద్ పవార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.