న్యూఢిల్లీ, జూన్ 29: అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్ (ఎన్డీయూడబ్ల్యూ) రూపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి క్షమార్హం కాదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ డేటాబేస్ను జూలై 31లోగా ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ఏడాది చివరికల్లా నమోదు ప్రక్రియను పూర్తిచేసి, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించింది. ఆగస్టు 21, 2018న తాము ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రస్తావించింది. అసంఘటిత కార్మికుల నమోదు కోసం ఒక ప్రక్రియను అందుబాటులో ఉంచాలని కేంద్ర కార్మికశాఖను మూడేండ్ల కిందట ఆ తీర్పులో ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యం వహించిందని మండిపడింది. వలస కార్మికులు తీవ్రమైన కష్టాలు పడుతుంటే కేంద్ర కార్మికశాఖకు చీమకుట్టినట్టయినా లేదని దాని వైఖరి తెలియజేస్తున్నదని వ్యాఖ్యానించింది. ఇప్పటికీ ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు (వన్ నేషన్- వన్ రేషన్ కార్డు – ఓఎన్ఓఆర్సీ) పథకాన్ని ప్రారంభించని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీలు) జూలై 31నాటికల్లా దానిని ప్రారంభించాలని గడువు విధించింది. కరోనా ప్రభావం ఉన్నంతకాలం వలస కార్మికులకు ఉచితంగా డ్రై రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు రాష్ర్టాలు, యూటీలు పథకాలు రూపొందించాలని సూచించింది. దీని కోసం రాష్ర్టాలు, యూటీలకు అదనంగా అహార ధాన్యాలను కేంద్రం కేటాయించాల్సి ఉంటుందని నిర్దేశించింది.
సుప్రీంకోర్టు సూచనలు..
వలస కార్మికులు తమ స్వస్థలాలను వదిలి ఇతర రాష్ట్రల్లో పని చేస్తుంటారు. అక్కడ వారి రేషన్కార్డులు రిజిష్టర్ అయి ఉండవు. దీనికి పరిష్కారం ఓఎన్ఓఆర్సీ. దీనివల్ల వలస కార్మికులు తాము పని చేస్తున్న దగ్గర రేషన్ సరుకులు తీసుకోవటానికి వీలవుతుంది.
సంక్షేమ పథకాల లబ్ధిని అందజేసేందుకు అసంఘటిత రంగ కార్మికుల వివరాలను నమోదు చేయాలి. దీని కోసం జాతీయ ఇన్ఫర్మేటిక్స్ కేంద్రం (ఎన్ఐసీ) సహాయంతో జూలై 31 నాటికల్లా ఒక పోర్టల్ను రూపొందించాలి.
కరోనా కొనసాగినన్ని రోజులూ వలస కార్మికుల కోసం సామూహిక వంటశాలలను కొనసాగించాలి.
ఆహార హక్కుకు సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనేమీ లేదు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రతి ఒక్కరికీ జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా కల్పించింది. గౌరవప్రదంగా బతికే హక్కు, ఆహారం, ఇతర కనీస అవసరాలు పొందే హక్కు కూడా ఇందులో భాగమే. పేద, బడుగు వర్గాలకు ఆహార భద్రత కల్పించడం అన్ని ప్రభుత్వాల బాధ్యత.
-సుప్రీంకోర్టు