Air India Plane Crash | అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా పైలట్లను నిందించడం బాధ్యతా రాహిత్యం, దురదృష్టకరమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. విమాన ప్రమాదంపై స్వతంత్ర, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జూలై 12న విడుదలైన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ప్రాథమిక నివేదిక విడుదల చేసిందని.. ఇందులో పైలట్ల తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఏఏఐబీ స్పష్టం చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారన్నారు. అయితే, నివేదికలోని పలు అంశాలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి సమాచారాన్ని విడుదల చేయాలని, ఇది ప్రమాదానికి కారణాన్ని గుర్తించడంలో సహాయపడుతుందన్నారు. అయితే, ప్రాథమిక విచారణ ఆధారంగా పైలట్లను నిందించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పైలట్లలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని సూచించే మీడియా నివేదికలు అత్యంత బాధ్యతారహితమైనవి ధర్మాసనం పేర్కొంది. నివేదిక ఆధారంగా పైలట్లను నిందిస్తే.. తుది విచారణలో వారి తప్పు లేదని తేలితే ఏం చేస్తారని అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై స్వతంత్ర, నిష్పాక్షికమైన, వేగవంతమైన దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై కోర్టు కేంద్రానికి, పౌర విమానయాన డైరెక్టర్ జనరల్కు నోటీసు జారీ చేసింది.
ఈ అంశం గోప్యత, గౌరవానికి సంబంధించినదని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రత్యర్థి విమానయాన సంస్థలు కొంత సమాచారాన్ని విడుదల చేయడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తూ.. ప్రమాదంపై స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పాక్షికంగా, త్వరితగతిన దర్యాప్తు జరపడం అనే పరిమిత అంశంపై మాత్రమే నోటీసు జారీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్ భవనంపై కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో సహా 265 మంది మరణించారు. 241 మంది మరణించిన వారిలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటన్ వాసులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ దుర్ఘటనలో ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే.