Sukesh Chandra Shekar | తనతో పాటు తన భార్యను మండోలి జైలు నుంచి దేశంలోని మరే ఇతర జైలుకైనా తరలించాలని కోరుతూ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మండోలి జైలులో తనపై భౌతిక దాడి జరిగిందని సుకేశ్ న్యాయవాది కోర్టుకు తెలుపగా.. వారంలోగా స్పందన చెప్పాలని కేంద్రం, ఢిల్లీ సర్కారును జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం కోరింది.
ఇదే సమయంలో లాయర్లతో రోజుకు 60 నిమిషాల పాటు సమావేశమయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మరో పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సుకేశ్, అతని భార్య లీనా తిహార్ జైలులో ఉండగా.. మండోలి జైలుకు తరలించాలని ఆగస్ట్ 23న సుప్రీంకోర్టు ఆదేశించింది. తమకు ప్రాణహాని ఉందని, ఢిల్లీ వెలుపల జైలుకు తరలించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మండోలి జైలులో తనపై దాడి జరిగిందని, ఇక్కడ జైలులో తమ ప్రాణాలకు ముప్పు ఉందని పిటిషన్లో సుకేశ్, లీనా పౌల్ పేర్కొన్నారు.
పిటిషన్పై సుకేశ్ తరఫు న్యాయవాది అశోక్ కే సింగ్ను కోర్టు ప్రశ్నించింది. గత నెలలో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఆగస్ట్ 23న సుప్రీంకోర్టు ఆదేశాలతో మండోలి జైలుకు తరలించారని, అక్కడ అతనిపై దాడి జరుగడంతో మరోసారి కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్ దీవులు సహా దేశంలో మరోదైనా జైలుకు తరలించాలని కోరారు. మనీలాండరింగ్ కేసు, పలువురిని మోసగించారన్న ఆరోపణలపై సుకేశ్ చంద్రశేఖర్తో సహా అతని భార్య లీనా మరియా పాల్ జైలు జీవితం గడుపుతున్నారు.