న్యూఢిల్లీ: ఉన్నావ్ రేప్ కేసులో యూపీ ఎమ్మెల్యే కుల్దీర్ సింగ్ సెంగార్(Kuldeep Sengar)కు ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన బెయిల్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. 2017లో ఉన్నావ్ రేప్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. జీవితఖైదు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీబీఐ సవాల్ చేసింది. అయితే ఆ కేసులో బీజేపీ నేత కుల్దీప్ సెంగార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 23వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కుల్దీప్ సెంగార్ను కస్టడీ నుంచి రిలీజ్ చేయరాదు అని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది.
సెంగార్కు బెయిల్ ఇచ్చిన వైఖరిని సీబీఐ తన పిటీషన్లో తప్పుపట్టింది. అయితే తాజాగా సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో కుల్దీప్ జైలులోనే కొనసాగనున్నారు. కుల్దీప్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రేపిస్టులకు రక్షణలు కల్పించడాన్ని ఖండిస్తూ ప్లకార్డులు, నినాదాలతో గత శుక్రవారం హైకోర్టు ప్రాంగణం సమీపంలో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి మద్దతుగా నిర్వహించిన ఆనిరసన ప్రదర్శనలలో ఐద్వాకు చెందిన సభ్యులతోపాటు సామాజిక కార్యకర్త యోగితా భావన, బాధితురాలి తల్లి తదితరులు పాల్గొన్నారు. తన కుమార్తె చాలా కష్టాలను ఎదుర్కొందని, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడానికే తాను వచ్చానని బాధితురాలి తల్లి మీడియాకు తెలిపారు.