న్యూఢిల్లీ, అక్టోబర్ 21: నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నదని, అయితే నిరవధికంగా రోడ్లను బ్లాక్ చేయడం తగదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రోడ్లపై స్వేచ్ఛగా సంచరించే హక్కు కూడా ప్రజలకు ఉందని గుర్తు చేసింది. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులను అక్కడి నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిల్పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరిపింది. తమ వ్యాఖ్యలు నిరసన తెలిపే హక్కుకు వ్యతిరేకం కాదని, కానీ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. దీనిపై రైతు సంఘాలు మూడు వారాల్లో స్పందనను తెలుపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) స్పందించింది. రోడ్లపై బ్యారికేడ్లు పెట్టింది ఢిల్లీ పోలీసులేనని, రైతులు కాదని వ్యాఖ్యానించింది. ‘సుప్రీం ఆదేశాలతో గాజీపూర్లో రైతులు ఉద్యమాన్ని ఆపేశారు. టెంట్లు తొలగిస్తున్నారు’ అంటూ జరిగిన ప్రచారం వదంతులేనని తెలిపింది.