న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు(Supreme Court) కీలక తీర్పును ఇచ్చింది. తమిళ యూట్యూబర్ సత్తై దురై మురుగన్ కు బెయిల్ మంజూరీని సమర్ధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై 2021లో యూట్యూబర్ మురుగన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ కేసులో అతన్ని అప్పట్లో అరెస్టు చేశారు. ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఆరోపణలు చేస్తున్నారు కాదా అని, ఎన్నికలకు ముందు యూట్యూబర్లను జైల్లో పెడితే, అలా ఎంత మందిని అరెస్టు చేయాల్సి ఉంటుందని సుప్రీం ప్రశ్నించింది. తన అభిప్రాయాలను, నిరసనను వ్యక్తం చేసేందుకు మురుగన్ తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయలేదని కోర్టు తెలిపింది.
గడిచిన 2.5 ఏళ్లుగా మురుగన్ బెయిల్పైనే ఉన్నారని, అతని బెయిల్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము కొట్టిపారేస్తున్నామని సుప్రీం బెంచ్ తెలిపింది. తమిళనాడు రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదించారు.
స్టాలిన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ మురుగన్ను అక్టోబర్ 2021లో అరెస్టు చేశారు. 2021 నవంబర్లో మద్రాసు హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఆ బెయిల్ను రద్దు చేసింది. అయితే 2022లో సుప్రీంకోర్టు ఆ యూట్యూబర్కు తాత్కాలిక బెయిల్ మంజూరీ చేసింది. అప్పటి నుంచి అతను ఆ బెయిల్పైనే ఉన్నాడు.