Pawan Khera : కాంగ్రెస్ పార్టీ (Congress Party) సీనియర్ నాయకుడు పవన్ ఖేరా (Pawan Khera) ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు (Supreme Court) రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sharma) భార్య రిణికి భూయాన్ శర్మ (Riniki Bhuyan Sharma) కు పలు పాస్పోర్టులు ఉన్నాయని, విదేశీ ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. దాంతో రిణికి భూయాన్.. పవన్ ఖేరాపై పరువు నష్టం కేసు వేసింది. దాంతో పవన్ ఖేరా ముందస్తు బెయిల్ కోసం గువాహటి హైకోర్టు (Gauhati High Court) లో పిటిషన్ వేశారు. హైకోర్టు ఖేరా పిటిషన్ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఖేరా పిటిషన్పై విచారణ జరుగుతోంది.
పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణ కోసం పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. నిర్బంధ విచారణతో అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇది పరువు నష్టానికి సంబంధించిన అంశమని గుర్తుచేశారు. ఈ కేసులో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తాను చట్టాలకు అతీతం అన్న రీతిలో స్పందించారని, ఆయన రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వల్లే పవన్ ఖేరా అరెస్టుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
వవన్ ఖేరాపై నమోదైన కేసుకు సంబంధించి పలు సెక్షన్ల కింద బెయిల్ పొందే అవకాశం ఉందని, మరికొన్ని సెక్షన్ల కింద అసలు అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని సింఘ్వి వాదించారు. అస్సాం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి భార్య పాస్ పోర్టులకు సంబంధించిన నకిలీ కాపీలను పవన్ ఖేరా చూపించారని ఆరోపించారు. ఆయన చూపించిన కాపీలన్నీ అవాస్తవమే అన్నారు. పరారీలో ఉండి వీడియోలు విడుదల చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది.