న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై 2012లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సవరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అభ్యర్థనను అనుమతించేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. స్పష్టత ఇవ్వాలన్న ముసుగులో తీర్పును సమీక్షించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని రిజిస్ట్రీ పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
2008 జనవరిలో ఏ రాజా టెలికం మంత్రిగా ఉన్న సమయంలో వివిధ సంస్థలకు కేటాయించిన స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేస్తూ 2012లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వేలం ద్వారా మాత్రమే స్పెక్ట్రమ్ను కేటాయించాలని కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు సవరించాలని కేంద్రం కోరుతున్నది.