న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం(Ayodhya Ram Mandir)లో విరాళ నిధులను దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆలయానికి సమర్పించిన కానుకలను చోరీ చేసిన కేసులో సీబీఐ నేతృత్వంలో సత్వర విచారణ చేపట్టాలని పిటీషన్ దాఖలైంది. ఆ పిటీషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ఇవాళ నిరాకరించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడుతామని, ఇప్పుడేం ఆకాశం ఊడి పడడం లేదని కోర్టు అభిప్రాయపడింది. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇద్దరు అడ్వకేట్లు పిల్ దాఖలు చేశారు. రామ మందిరంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సీబీఐతో పాటు ఇతర ఏజెన్సీల నేతృత్వంలో దర్యాప్తు జరగాలని ఆ పిటీషన్లో కోరారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు చేపట్టిన దర్యాప్తు విశ్వసనీయంగా లేనట్లు ఆ అడ్వకేట్లు తమ పిటీషన్లో పేర్కొన్నారు. చోరీకి సంబంధించిన కీలకమైన ఆధారాలను సరైన రీతిలో కాపాడడం లేదని ఆ పిటీషన్లో ఆరోపించారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్, షీల్ నాగుతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో విచారణ చేపట్టింది. అత్యవసర విచారణ అవసరం లేదని, జూలై 12 నుంచి 17 మధ్య ఈ పిటీషన్పై విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలను చోరీ చేసిన కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేశారు. ఇక శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. మరో ట్రస్టీ సభ్యుడు అనిల్ మిశ్రా వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయనున్నారు. ఆలయంలో జరిగిన విరాళాల చోరీ ఘటన షాకింగ్గా ఉందని, బాధపెట్టిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిష్పాక్షిక దర్యాప్తునకు కట్టుబడి ఉన్నట్లు చెప్పింది.
చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలు అందినట్లు ట్రస్టు కన్ఫర్మ్ చేసింది. తమ తదుపరి సమావేశంలో వీటిపై చర్చిస్తామన్నారు. శ్రీరాముడికి సమర్పించిన అన్ని బంగారు, వెండి ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు ట్రస్టు పేర్కొన్నది.