న్యూఢిల్లీ: పోలింగ్ జరిగిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయన్న అంశంపై బూత్ ఓటర్ల డేటాను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఏడీఆర్ ఎన్జీవో సంస్థ పెట్టుకున్న పిటీషన్ను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. ఆ అభ్యర్థనపై తాత్కాలిక ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈసీ వెబ్సైట్లో ఫారమ్ 17సీ డేటాను అప్లోడ్ చేయాలన్న అప్లికేషన్ను కోర్టు కొట్టిపారేసింది. బూత్ డేటాను అప్లోడ్ చేయడం వల్ల ఓటర్లు అయోమయంలో పడే అవకాశాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఫారమ్ 17సీకి చెందిన సమాచారాన్ని కేవలం అభ్యర్థికి లేదా అతని ఏజెంట్కు ఇవ్వడం జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఇదే అంశంపై మరో పిటీషన్ కూడా 2019 నుంచి పెండింగ్లో ఉన్నట్లు కోర్టు ధర్మాసనం తెలిపింది. 2019లో దాఖలైన పిటీషన్లో ని ఏ భాగం, 2024 అప్లికేషన్కు చెందిన బీ భాగం రెండూ ఒక్కటే అని, అందుకే ఈ కేసులో ఎటువంటి తాత్కాలిక రిలీఫ్ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.