SC Collegium | కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతేడాది నంబర్ 11 నుంచి 70 కొలీజియం సిఫారసులు పెండింగ్లో ఉన్నాయన్న సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియా నేతృత్వంలోని ధర్మాసనం కొలీజియం సిఫారసులపై నిర్ణయం ఆలస్యం జరుగుతుండడంపై సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి సూచించింది.
కొలీజియం సిఫారసులపై సమయ పాలన పాటించనందుకు కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరుకు చెందిన అడ్వకేట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనికి ఎన్జీవో కామన్ కాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ సైతం జోడించారు. ఎన్జీవో కామన్ కాజ్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. నియామకాల్లో జాప్యం కారణంగా చాలా మంది న్యాయవాదులు న్యాయమూర్తి పదవికి తమ సమ్మతిని ఉపసంహరించుకున్నారన్నారు. దీంతో ధర్మాసనం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
26 మంది జడ్జీల బదిలీలు, ఓ సున్నితమైన హైకోర్టులో చీఫ్ జస్టిస్ నియామకం పెండింగ్లో ఉందని పేర్కొంది. హైకోర్టు సిఫార్సు చేసిన తర్వాత కొలీజియానికి పంపని పేర్లు ఎన్ని ఉన్నాయో తమ వద్ద పూర్తి సమాచారం ఉందని జస్టిస్ జస్టిస్ కౌల్ పేర్కొన్నారు. అయితే, దీనిపై స్పందించేందుకు వారం గడువు కావాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి గడువు కోరారు. ఈ మేరకు బెంచ్ ఆయనకు రెండువారాల గడువు ఇస్తూ అక్టోబర్ 9వ తేదీకి విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా కొలీజియం సిఫారసులపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై జస్టిస్ కౌల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తాను చెప్పాల్సింది ఎంతో ఉందన్న ఆయన.. ఇక్కడితో ఆపేస్తున్నానన్నారు. ఈ అంశంపై స్పందించేందుకు కేవలం వారం మాత్రమే గడువు కోరడంతో మౌనంగా ఉంటున్నామన్నారు. తదుపరి విచారణలో మాత్రం తాను మౌనంగా ఉండబోనన్నారు. న్యాయమూర్తుల నియామకం అనేది సుప్రీంకోర్టు, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య వివాదంలో కీలకమైన అంశంగా మారినట్లు పేర్కొన్నారు. గతవారం వరకు కొలీజియం సిఫార్సులు 80 పెండింగ్లో ఉండగా.. ఇందులో కేవలం పది మాత్రమే పరిష్కారమయ్యాని కోర్టు పేర్కొంది.