న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) విచారణ చేపట్టింది. మూడు వారాల్లోగా పిటీషన్లకు వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ప్రస్తుతం సీఏఏ అమలుపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. అయితే ఈ కేసులో మళ్లీ ఏప్రిల్ 9వ తేదీన విచారణ ఉంటుందని సుప్రీం తెలిపింది. సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంలో 236 పిటీషన్లు దాఖలు అయ్యాయి. ఇటీవల ఆ చట్టానికి చెందిన రూల్స్ను నోటిఫై చేస్తూ ఇచ్చిన ఆదేశాలను కూడా ఆయా పిటీషన్లలో సవాల్ చేశారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీఏఏను సవాల్ చేస్తూ ఇండియన్ ముస్లిం లీగ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తున్నారు. 1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 2ను సవరించారు. దాని ప్రకారమే ఆఫ్ఘన్, బంగ్లా, పాక్లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సి, క్రైస్తవ మైనార్టీలకు పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. పొరుగు దేశాల్లో మతపరమైనవేధింపులకు గురవుతున్న వారిని రక్షించాలన్న ఉద్దేశంతో ఆ సవరణ రూపొందించారు.