న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితుల క్షమాభిక్షకు సంబంధించిన అన్ని ఒరిజినల్ రికార్డులను ఈ నెల 16లోగా తమకు సమర్పించాలని కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. ఆగస్టులో ప్రారంభమైన ఈ కేసును జస్టిస్లు బీవీ నాగరత్న, ఉజ్జల్ భువన్ ధర్మాసనం విచారణను ముగించి తీర్పు రిజర్వ్ చేసింది.
గోధ్రా రైలు దహనం అనంతరం 2002లో గుజరాత్ అల్లర్లలో ఐదు నెలల గర్భంతో ఉన్న బిల్కిస్ బానో అనే 21 ఏండ్ల యువతిపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడటమే కాక, ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హతమార్చారు. ఈ కేసులో 11 మంది ముద్దాయిల శిక్షాకాలం పూర్తి కాకుండానే గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పేరుతో ముందస్తుగా విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.