న్యూఢిల్లీ: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. రెండు ప్రయత్నాలలో వీరు ఎంబీబీఎస్ తుది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఇచ్చింది. దేశంలోని మెడికల్ కాలేజీల్లో నమోదు కాకుండానే నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) సిలబస్, మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు రాయవచ్చని కోర్టు పేర్కొన్నది. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం విచారించింది. పార్ట్-1, పార్ట్-2 (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు రాసేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే, రెండు అవకాశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ఈ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రెండేండ్ల పాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. తొలి ఏడాది ఉచితంగా చేయాలని, రెండో ఏడాది జీతం ఇస్తారని పేర్కొంది.