న్యూఢిల్లీ, జూలై 16: ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై బుల్డోజర్లను ఉపయోగించవచ్చునని, అయితే టార్గెట్ చేస్తూ ఎవరిపైనా వాటిని ఉపయోగించరాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రతి కేసులోనూ చట్టపరమైన ప్రక్రియను అనుసరించారా లేదా అనే విషయాన్ని హైకోర్టులు పరిశీలించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. బుల్డోజర్లను ఉపయోగించి ఏకపక్షంగా కూల్చివేతలు జరుపుతున్నారన్న ఆరోపణలపై దాఖలైన పలు ధిక్కారణ పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
బుల్డోజర్ల చర్యలపై అన్ని వేళలా నిషేధం (బ్లాంకెట్ బ్యాన్) విధించలేమని పేర్కొన్న సుప్రీం.. ప్రజలను శిక్షించడానికి లక్ష్యాలను ఎంపిక చేసుకోకూడదని స్పష్టంగా వ్యాఖ్యానించింది. బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు 2024 నవంబర్లో ఇచ్చిన తీర్పును, అందులోని మార్గదర్శకాలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ పలు రాష్ర్టాల నుంచి దాఖలైన పిటిషన్ల విచారణను తిరస్కరించిన సుప్రీం కోర్టు ఆ వివాదాలను సంబంధిత హైకోర్టులే విచారించాలని చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.