న్యూఢిల్లీ, మార్చి 21: మొబైల్ ఫోన్లలో చిత్రించిన వీడియోలను ప్రజలు వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే ధోరణి పట్ల సుప్రీం కోర్టు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలు పారదర్శక విచారణకు ముప్పుగా మారుతుందని పేర్కొంది. నిందితుల ఫొటోలు, వీడియోలను పోలీసులు సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తుండటంతో అది ప్రజల మనస్సుల్లో వారిపట్ల వ్యతిరేక భావన కలిగిస్తున్నదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ను సీజేఐతో కూడిన ధర్మాసనం విచారించింది. పోలీసులు మీడియాకు తెలియజేసే వివరాలకు సంబంధించి అన్ని రాష్ర్టాలకు సుప్రీం కోర్టు గతంలోనే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని సామాజిక మాధ్యమాలకు కూడా వర్తింప జేయాలని పిటిషనర్ కోరారు. ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి ఉన్నవి, తాళ్లతో కట్టి ఉన్నవి, అర్ధనగ్నంగా నడిపిస్తున్నవి, బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి ఉన్న చిత్రాలను పోలీసులు పోస్ట్ చేస్తున్న ట్రెండ్ పెరిగిపోయిందని, ఇది ఆయా వ్యక్తుల గౌరవానికి భంగం కలిగిస్తున్నదని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.