Supreme Court | న్యూఢిల్లీ, మే 9: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశంగా మారిన ముస్లిం రిజర్వేషన్ల రుద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్లను రద్దుచేయటాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో నిత్యం ప్రస్తావిస్తూ గర్వంగా చెప్పుకోవటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో విచారణలో ఉన్న అంశంపై రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారని అసహనం వ్యక్తంచేసింది. మంగళవారం కేసు విచారణ సందర్భంగా కోర్టులో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొన్నది. ముస్లిం వర్గాల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే.. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై కేంద్ర హోంమంత్రి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఏం ఆశించి ఈ ప్రకటనలు చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఈ దశలో కర్ణాటక ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆగ్రహంతో ఊగిపోయారు.
‘ఇది సుప్రీంకోర్టు.. చేపల మార్కెట్లా మారనీయొద్దు. దవే పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను ధర్మాసనం అడ్డుకోవాలి. ఆయన సంబంధం లేని విషయం మాట్లాడుతున్నారు. కేసు విచారణకు, ఆయన మాటలకు సంబంధం ఏమిటో చెప్పాలి. అలాంటి వాదనకు ముందు అందుకు సంబంధించిన అప్లికేషన్ దాఖలు చేయాలి’ అని కోరారు. దీంతో తప్పకుండా అప్లికేషన్ దాఖలు చేస్తామని దవే బదులిచ్చారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘కోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉన్నది. కర్ణాటకలో ముస్లింలకు రిజర్వేషన్పై కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అంశంపై రాజకీయ ప్రకటనలు చేయటం ఏమాత్రం సహించలేం. కాస్త విలువలు పాటించాలి’ అని సున్నితంగా చురకలంటించింది. తదుపరి విచారణను జూలై 25వ తేదీకి వాయిదా వేసింది.
కర్ణాటకలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ ఉన్నది. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు గత మార్చిలో బీజేపీ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఆ కోటాను రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజిక వర్గాలపై ఒక్కలిగ, లింగాయత్లకు చెరో రెండు శాతం చొప్పున కల్పించింది. దీని ద్వారా హిందూ ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.