Supreme Court | మొబైల్ ఫోన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్లో కేసు వాదిస్తున్న న్యాయవాది తీరుతో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనానికి గురైంది. కరోనా నేపథ్యంలో డిజిటల్గా కేసు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతోపాటు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం సోమవారం పలు కేసుల్ని విచారించింది. మొబైల్ ఫోన్లలో న్యాయవాదులు వినిపిస్తున్న వాదనల్లో ఆడియో క్లారిటీ లేకపోవడంతో పలు కేసుల విచారణను వాయిదా వేసింది. తర్వాత మరో కేసులోనూ న్యాయవాది మొబైల్ ఫోన్ ద్వారా వినిపిస్తున్న వాదనలు సరిగ్గా వినిపించలేదు.
సిగ్నల్స్ సరిగ్గా లేక ఆడియో, వీడియో క్లారిటీగా రాక పోవడంతో జస్టిస్లు సదరు న్యాయవాదిపై గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చింది. లాయర్ గారూ.. మీరు సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. తరచుగా కేసు విచారణ కోసం వీడియో కాన్ఫరెన్సింగ్లో పాల్గొంటున్నారు. ఓ కంప్యూటర్ కొనుక్కోలేరా? అని ప్రశ్నించింది.
తమకు ఇలా కేసులు విచారించే శక్తి లేదని, దయచేసి మాటలు స్పష్టంగా వినిపించే డివైజ్లు తెచ్చుకోవాలని సదరు న్యాయవాదికి జస్టిస్లు సూచించారు. స్టేబుల్ ఇంటర్నెట్ గల డెస్క్టాప్ లేదా లాప్టాప్ కంప్యూటర్ ద్వారా సిస్కో వెబెక్స్ అప్లికేషన్లో చేరి వాదనలు వినిపించాలని న్యాయవాదులు, కక్షిదారులకు న్యాయస్థానం సూచించింది. మొబైల్ ఫోన్ల ద్వారా కాకుండా బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.