Supreme Court | అధికారుల బదిలీకి సంబంధించిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC) చైర్మన్గా రిటైర్డ్ జస్టిస్ ఉమేశ్కుమార్ ప్రమాణ స్వీకారాన్ని సైతం జులై 11 వరకు సుప్రీంకోర్టు నిలిపివేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. జులై 11కు ముందు సమాధానాలను దాఖలు చేయాలని కేంద్రం, ఎల్జీని కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (DERC) చైర్మన్గా నియామకమైన జస్టిస్ (రిటైర్డ్) ఉమేశ్ నియామకమయ్యారు. అయితే, మంగళవారం ఉదయం 10 గంటల వరకు ప్రమాణస్వీకారానికి ఆదేశాలు జారీ చేయగా.. ఆయన ప్రమాణం స్వీకారం చేయలేదు. అలాగే ఢిల్లీ విద్యుత్ శాఖ మంత్రి అతిషి కుమార్ సైతం ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా.. ఆమె ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా కార్యక్రమాన్ని జులై 6వ తేదీకి వాయిదా వేశారు.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్పై తక్షణమే స్టే విధించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో డిమాండ్ చేసింది. వాస్తవానికి అధికారుల బదిలీ, పోస్టింగ్ హక్కుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆప్ సర్కారుకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.
ఆ తర్వాత ఢిల్లీలోని గ్రూప్-ఏ అధికారుల బదిలీలు, వారిపై క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్తో సుప్రీంకోర్టు ఆదేశాలు నిరుపయోగమయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పాటించడం లేదని, ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగడుతూ.. పలువురు నేతలను కలిశారు. మరో వైపు సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు.