Supreme Court | మణిపూర్లో అల్లర్లు, మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనకు సంబంధించిన కేసుపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ చేపట్టింది. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం జరిగిందని స్పష్టమవుతుందని పేర్కొంది. ఓ మహిళను కారులో నుంచి తోసేసి ఆమె కుమారుడి ముందే హత్య చేసిన ఘటనను కోర్టు ప్రస్తావిస్తూ.. మే 4న ఘటన జరిగితే.. అయితే ఈ కేసులో ఎఫ్ఐఆర్ను జులై 7న నమోదు చేశామని తెలిపింది. మణిపూర్ ప్రభుత్వం కేవలం ఒకటి రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం మినహా ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పింది.
విచారణ సైతం డోలాయమానంగా ఉందని, ఎఫ్ఐఆర్లు నమోదు చేసి రెండు నెలలు గడుస్తున్నా వాంగ్మూలాలు సైతం నమోదు చేయలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, మహిళలను నగ్నంగా ఊరేగించిన వైరల్ వీడియోకు సంబంధించి.. వారి స్టేట్మెంట్లను రికార్డు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. అయితే, సీబీఐ మహిళలను వాంగ్మూలాలను నమోదు చేసేందుకు పిలిచిందని.. మహిళల తరఫు న్యాయవాది నిజాంపాషా కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. దీనిపై తనకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత తెలిపారు.
అయితే, మణిపూర్లో జరిగిన హింసకు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వం 6,523 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మహిళలను వివస్త్రలను చేసిన కేసులో రాష్ట్ర పోలీసులు మే 5న జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో మైనర్ సహా ఏడుగురిని అరెస్టు చేశారని చెప్పారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలు తెరపైకి రావడంతో పోలీసులు వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలుస్తోందని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు చెప్పారు.
అయితే, వీడియో వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో చాలా జాప్యం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎఫ్ఐఆర్లలో ఎంత మంది నిందితుల పేర్లు ఉన్నాయని, వారిని అరెస్టు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ఎస్జీని ప్రశ్నించింది. రాష్ట్రంలో హింసకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణకు హాజరు కావాలని మణిపూర్ డీజీపీని కోర్టు ఆదేశించింది. అలాగే మహిళలను వివస్త్రలను చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలు, సంఘటన నమోదు తేదీలు, జీరో ఎఫ్ఐఆర్, సాధారణ ఎఫ్ఐఆర్ వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.