న్యూఢిల్లీ/తిరువనంతపురం, నవంబర్ 29: అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు అటు ఆమోదం తెలుపుకుండా, ఇటు పునఃపరిశీలన కోసం అసెంబ్లీకి పంపకుండా ఏండ్లుగా పెండింగ్లో పెట్టిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాలుగా బిల్లును ఎందుకు తొక్కిపెట్టారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.
బిల్లులను పెండింగ్లో పెట్టేందుకు గవర్నర్ ఎలాంటి కారణం చూపలేదని పేర్కొన్న న్యాయస్థానం.. చట్టసభలు చట్టాలు చేసే ప్రక్రియను నిలిపివేసేలా గవర్నర్ తన అధికారాలను వినియోగించకూడదని హితవు పలికింది. బిల్లుల విషయంలో గవర్నర్కు జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. ఇటీవల పంజాబ్ గవర్నర్కు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎనిమిది బిల్లులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా పెండింగ్లో పెట్టడంపై గవర్నర్ ఆరిఫ్ ఖాన్కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది.
విచారణకు ఒక్క రోజు ముందుగా..
తమ రిట్ పిటిషన్పై నోటీసులు జారీచేసిన తర్వాత, అది కూడా బుధవారం విచారణ జరుగనున్న నేపథ్యంలో ఒక్కరోజు ముందు గవర్నర్ ఒక బిల్లును ఆమోదించి, మరో ఏడు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ రిఫర్ చేసిన విషయాన్ని కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వీటిల్లో కొన్ని బిల్లులను అసెంబ్లీ 2021లో ఆమోదించిందని, అప్పటి నుంచి గవర్నర్ పెండింగ్లో పెట్టారని పేర్కొన్నారు.
‘రెండేండ్లుగా వెల్ఫేర్ బిల్లు చట్టంగా మారేందుకు అనుమతించలేదు. దీని వలన రాష్ట్ర పాలన దెబ్బతింటున్నది. దీనిపై న్యాయస్థానం జోక్యం చేసుకోకుంటే.. అది పౌరులపై ప్రభావం చూపుతుంది’ అని వాదించారు. వాదనను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం.. ‘మిస్టర్ అటార్నీ జనరల్, గవర్నర్ బిల్లులపై రెండేండ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు?’ అని ప్రశ్నించింది. దీనిపై స్పందించని ఏజీ ఆర్ వెంకటరమణి.. తాను రాజకీయ అంశాల్లోకి పోదలచుకోలేదని అన్నారు. బదులుగా ‘మేం వెళ్లాం. ఎందుకంటే ఇది జవాబుదారీతనానికి సంబంధించింది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను ఏ సందర్భంలో రిజర్వ్ చేయాలో మార్గదర్శకాలు రూపొందించే సమయం ఆసన్నమైందని కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో పాలనను నిలిపివేసేలా గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడాన్ని అనుమతించకూడదని అన్నారు. రాష్ట్రపతికి గవర్నర్ రిఫర్ చేసిన ఏడు బిల్లుల్లో ప్రభుత్వం మూడింటిని ఆర్డినెన్స్ల రూపంలో తీసుకొచ్చిందని, వాటిని అప్పుడు అభ్యంతరం తెలుపుకుండా ఆమోదం తెలిపిన గవర్నర్.. ఇప్పుడెందుకు రాష్ట్రపతికి రిఫర్ చేశారని అన్నారు. మార్గదర్శకాల కోసం పిటిషన్ను సవరించేందుకు కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
సీఎంతో కూర్చొని చర్చించండి
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్కు పలు కీలక సూచనలు చేసింది. బిల్లులపై చర్చించేందుకు సీఎం పినరాయి విజయన్, సంబంధిత మంత్రితో సమావేశం కావాలని సూచించింది. పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొన్నది. లేనిపక్షంలో చట్టాన్ని నిర్దేశించేందుకు, రాజ్యాంగం ప్రకారం తమ విధి నిర్వర్తించేందుకు తాము ఇక్కడ ఉన్నామని స్పష్టం చేసింది. రాష్ట్రపతికి గవర్నర్ ఏ సమయంలో బిల్లులను రిఫర్ చేయాలో అనే అంశంపై మార్గదర్శకాలు రూపొందించడాన్ని పరిగణనలోకి తీసుకొంటామని పేర్కొన్నది. కాగా, గవర్నర్ తీరుపై సీఎం విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.