Governor | న్యూఢిల్లీ, నవంబర్ 6: దేశంలో రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్న గవర్నర్ల వ్యవస్థపై సుప్రీంకోర్టు సోమవారం పదునైన వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు సమస్యను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడం, ఆపై రాష్ట్ర ప్రభుత్వాల సహనాన్ని పరీక్షించడం.. అవి సుప్రీంకోర్టుకు వెళ్లిన తరువాత.. అప్పుడు చర్యలు ప్రారంభించడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.
పంజాబ్తోపాటు గతంలో తెలంగాణలో కూడా గవర్నర్లు ఇలాగే వ్యవహరించారని గుర్తుచేసింది. కేరళ గవర్నర్ సైతం రెండేండ్లుగా బిల్లులు తొక్కి పెట్టిన అంశంపై త్వరలో విచారణ జరుపుతామని పేర్కొంది. గవర్నర్లు తమ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లకముందే తగిన చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం హితవు చెప్పింది.
సుప్రీంకోర్టుకు వెళ్లేవరకూ ఆగి.. ఆ తరువాత స్పందించడం ఇక నిలిపివేయాలని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోనూ..
అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలుపకుండా గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ పంజాబ్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. తన వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ ఆమోదించేలా గవర్నర్ను ఆదేశించాలని కేంద్రానికి సూచించింది. పంజాబ్ సర్కార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. జూన్ 26న ప్రభుత్వం నాలుగు బిల్లులు పంపిందని, వాటిని ఆమోదించకుండా గవర్నర్ తొక్కి పెట్టారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయకుండా సీఎంకి గవర్నర్ లేఖ రాశారని చెప్పారు. ఆర్థిక అంశాలకు సంబంధించిన బిల్లులను 4 నెలలుగా తొక్కి పెట్టారని వివరించారు.
ఇలాంటి పరిస్థితులే మరో రాష్ట్రంలో కూడా జరిగాయి కదా అంటూ సీజేఐ తెలంగాణలో జరిగిన ఉదంతాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టిన విషయం తెలిసిందే. చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో అవి ఆమోదం పొందాయి. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘ప్రభుత్వాలు గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దాకా ఎందుకు రావాలి? గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించాలి కదా!’ అని వ్యాఖ్యానించారు.
కోర్టుకెక్కాక ఆమోదిస్తున్నారు..
ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించిన సింఘ్వీ మాట్లాడుతూ.. తెలంగాణ సమస్యపై కూడా తాము సుప్రీంకోర్టుకు వచ్చిన తరువాత ఆ రాష్ట్ర గవర్నర్ బిల్లును ఆమోదించారని తెలిపారు. ‘మీరు సుప్రీంకోర్టుకు వచ్చిన తరువాత గవర్నర్ చర్యలకు ఉపక్రమించడం భావ్యం కాదు.. ఇకపై ఇలా జరుగకూడదు’ అని సీజేఐ అన్నారు. గవర్నర్లు, ప్రభుత్వాలు.. ఇద్దరూ కొంత ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరముంది అని అభిప్రాయపడ్డారు.