న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి రోహింగ్టన్ ఫాలీ నారీమన్ ( Justice Rohington Fali Nariman ) ఇవాళ రిటైర్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత.. సుప్రీంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రెండవ జడ్జి ఆయన. ఉత్తమ ప్రొఫైల్ ఉన్న నారీమన్ అనేక కీలక తీర్పులను వెలువరించారు. రోహింగ్టన్ రిటైర్మెంట్ సందర్భంగా సుప్రీం జడ్జిలు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఫేర్వెల్ కార్యక్రమంలో సీజే ఎన్వీ రమణ మాట్లాడుతూ.. నారీమన్ జ్ఞానాన్ని, మెధస్సును ఈ సంస్థ కోల్పోతుందన్నారు. బలమైన న్యాయవ్యవస్థలో ఆయన ఒక పిల్లర్ అన్నారు. నారీమన్ ఎల్లప్పుడూ న్యాయం వైపు నిలబడ్డట్లు సీజే చెప్పారు. ఈ క్షణం కొంత ఉద్విగ్నంగా ఉందని, నా ఆలోచనల్ని వ్యక్తపరచడం ఇబ్బందిగా ఉందని సీజే రమణ అన్నారు.
ఇవాళ చివరి రోజు కావడం వల్ల.. కోర్టు నెంబర్ వన్లో సీజే రమణతో కలిసి నారీమన్ కూర్చుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన జస్టిస్ నారీమన్ 35 ఏళ్ల పాటు న్యాయవృత్తిలో కొనసాగారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారీమన్ కుమారుడే రోహింగ్టన్ నారీమన్. 37 ఏళ్ల వయసులో సీనియర్ లాయర్గా సుప్రీంకోర్టులో రోహింగ్టన్ నియమితులైయ్యారు. 2011లో ఆయన్ను సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమించారు. నేరుగా సుప్రీం జడ్జిగా నియమితులైన అయిదవ లాయర్ ఆయన. జస్టిస్ నారీమన్ ఇప్పటి వరకు 13,565 కేసులను వాదించినట్లు సీజే రమణ తెలిపారు.
ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేసింది జస్టిస్ నారీమన్. హోమోసెక్స్పై ఇచ్చిన తీర్పులో ఆయన ధర్మాసనాన్ని పంచుకున్నారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పునిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశాన్ని అడ్డుకోరాదు అని ఓ తీర్పులో చెప్పారు. కస్టడీ మరణాల విషయంలో పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు అమర్చాలని ఆదేశించారు. తాజా తీర్పులో రాజకీయ నేరచరితులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. న్యాయవ్యవస్థను సింహంలా కాపాడిన జస్టిస్ నారీమన్ను కోల్పోతున్నామని సీజే రమణ తన నివాళిలో పేర్కొన్నారు.