Supreme Court | ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగి, దానికి ఎలాంటి కారణాలు ఇవ్వని కేసుల విషయంలో న్యాయస్థానాలు అప్రమత్తంగా ఉండాలని, సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. హత్య కేసులో జీవిత ఖైదుపడిన ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన సమయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 1989 నాటి హత్య కేసులో నిందితులను నిర్దోషులగా ప్రకటిస్తూ వారిని విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఛత్తీస్గఢ్లో ఇద్దరిపై ఆగస్టు 25, 1989లో ఓ వ్యక్తి హత్యకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాతి రోజు బిలాస్పూర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఈ కేసులో ఇద్దరు దోషిగా తేలగా.. ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఫిబ్రవరి 2010లో ఛత్తీస్గఢ్ హైకోర్టు సైతం ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని, జీవితఖైదును సమర్థించింది. చివరకు హైకోర్టు నిర్ణయాన్ని నిందితులు ఇద్దరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. హత్యకు నిర్దిష్ట కారణాలేవి తెలియలేదని కోర్టు పేర్కొంది. అలాగే కేసులో ముఖ్యమైన అంశాలపై దర్యాప్తు చేయలేదని కోర్టు తెలిపింది. అలాగే కేసు ప్రత్యక్ష సాక్షి తన వాంగ్మూలాన్ని మార్చుకున్నాడని, దాంతో వాంగ్మూలం విశ్వసనీయత ప్రశ్నారక్థమైందని చెప్పింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ సైతం ఆలస్యమైందని పేర్కొంది.