న్యూఢిల్లీ: మణిపూర్లో మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గానికి అణచివేత సందేశం పంపేందుకే మూకలు మహిళలపై లైంగిక హింసకు పాల్పడుతుంటాయని అభిప్రాయపడింది. ఇటువంటి ఘటనలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని స్పష్టం చేసింది. ప్రజలు అటువంటి హింసకు పాల్పడకుండా నియంత్రించడం, హింసలో లక్ష్యంగా ఉన్న బాధిత ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నది. మణిపూర్ అంశంపై దాఖలైన పిటిషన్ ఉత్తర్వుల ప్రతులు సుప్రీంకోర్టు వెబ్సైట్లో గురువారం అప్లోడ్ చేశారు. మణిపూర్ బాధితులకు పునరావాసం, పరిహారం, అల్లర్లలో ధ్వంసం అయిన ఇండ్లు, ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ తదితర చర్యలపై పర్యవేక్షణతో పాటు మే 4న జరిగిన మహిళల నగ్న ఊరేగింపు, లైంగిక దాడి ఘటన స్వభావంపై అన్ని కోణాల్లో, అన్నివైపులా సమాచారం సేకరించి విచారణ చేయాలని కమిటీని ధర్మాసనం ఆదేశించింది.
రాజ్యాంగ విలువల ఉల్లంఘన
మహిళలపై లైంగిక నేరాలు, హింస ఎంతమాత్రం ఆమోదనీయం కాదని, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం, స్వతంత్రతను ఇవి ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గుంపులో ఉండటం వలన శిక్షను తప్పించుకోవచ్చనే భావనతో పాటు పలు ఇతర కారణాలతో మూకలు మహిళలపై నేరాలు, హింసకు పాల్పడుతుంటాయని సీజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. బాధిత వర్గానికి అణచివేత సందేశం పంపేందుకు మూకలు మహిళలపై లైంగిక హింసను ఉపయోగించుకొంటాయని పేర్కొన్నది.
నిందితులను వేగంగా గుర్తించాలి
కేసుల దర్యాప్తును పూర్తి చేసేందుకు త్వరితగతిన నిందితులను గుర్తించి, వారిని అరెస్టు చేయడం ఎంతో కీలకమని కోర్టు పేర్కొన్నది. లేకుంటే నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం, పారిపోవడం వంటివి చేసే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించింది. వర్గ హింస వలన భారీస్థాయిలో జరిగే ఆస్తి నష్టాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత చట్టబద్ధ పాలనపై ఉంటుందని పేర్కొన్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధితులకు భరోసా కల్పించేందుకు తాము జోక్యం చేసుకొన్నామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. హింసను అరికట్టడంలో పోలీసులు విఫలమవడంతో పాటు నిందితులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలను కోర్టు ప్రస్తావించింది. సరైన దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు తెలుస్తాయని, విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులను తప్పనిసరిగా బాధ్యులను చేయాలని పేర్కొన్నది.