న్యూఢిల్లీ : అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాడుకునేందుకు ఆక్సిజన్ మిగులు నిల్వలను సిద్ధం చేసుకోవాలని. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో ఈ దిశగా చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరాల గొలుసు దెబ్బతిన్నా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆక్సిజన్ నిల్వల స్ధావరాలను వికేంద్రీకరించాలని స్పష్టం చేసింది. రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాలను కొనసాగిస్తునే నాలుగు రోజుల్లోగా ఎమర్జెన్సీ నిల్వలను ఏర్పాటు చేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ పేర్కొంది.
ఆక్సిజన్ ఎమర్జెన్సీ నిల్వలు తరుగుతున్న తీరును రియల్ టైమ్ లో సమీక్షిస్తూ తదనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో వర్చువల్ కంట్రోల్ రూం ద్వారా సమీక్షించాలని సూచించింది. ఢిల్లీలో కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మే 3 అర్ధరాత్రిలోగా దేశ రాజధానిలో ఆక్సిజన్ సరఫరాల్లో లోటుపాట్లు చక్కదిద్దాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జాతీయ సంక్షోభం తలెత్తిన వేళ ప్రజల ప్రాణాలను కాపాడటం కీలకమని, ఇది ప్రభుత్వ బాధ్యతని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో దవాఖానల్లో అడ్మిషన్లకు సంబంధించి రెండు వారాల్లోగా జాతీయ విధానానికి రూపకల్పన చేయాలని కూడా సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది.