న్యూఢిల్లీ: సామాజికవేత్త తీస్తా సెతల్వాద్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో సుప్రీంకోర్టు బుధవారం రెగ్యులర్ బెయిల్ మంజూరుచేసింది. ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ‘వెంటనే లొంగిపోవాలి’ అంటూ గుజరాత్ హైకోర్టు (జూలై 1న) జారీచేసిన ఉత్తర్వులపై జస్టిస్ బీర్ గవాయి, ఏఎస్ బోపన్న, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘గుజరాత్ హైకోర్టు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రాథమిక ఆధారాలు పరిశీలించకుండా దిక్కుమాలిన ఆదేశాలు వెలువడ్డాయి. బెయిల్ పిటిషన్ పరిశీలనలో గుజరాత్ హైకోర్టు తీరు హేతుబద్ధంగా లేదు.
ఇలాగైతే నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సాక్ష్యుల్ని బెదిరించే ప్రయత్నం చేసిందా? సాక్ష్యాధారాల్ని తారుమారు చేయగలదా? పారిపోయే అవకాశముందా? అన్నది తెలుసుకోకుండానే గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో తీస్తా సెతల్వాద్ తప్పుడు సమాచారం ఇచ్చారని, అమాయకుల్ని హత్య కేసులో ఇరికించారని గుజరాత్ ఏటీఎస్ పోలీసులు గతేడాది కేసు నమోదు చేశారు. ఆ వెంటనే అరెస్టు చేశారు. బెయిల్ పిటిషన్ను సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టు తిరస్కరించాయి. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించగా, దీనిని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించింది.