excise policy case | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.2 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్పై అభియోగాలు మోపిన ఈడీ.. అతడి వద్ద డబ్బులేమీ స్వాధీనం చేసుకోలేదని, డబ్బుల జాడ లేదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సంజయ్సింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను జస్టిస్లు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా, పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఆయన ఇంకా కస్టడీలో ఉండాలని ఈడీ కోరుతున్నదా? అని ఈడీ తరపున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ధర్మాసనం ప్రశ్నించింది. సంజయ్ వద్ద నుంచి డబ్బును రికవరీ చేయని విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. రూ.2 కోట్ల లంచం ఆరోపణలను ట్రయల్లో భాగంగా విచారించవచ్చని పేర్కొన్నది. అయితే, సంజయ్కు బెయిల్ ఇచ్చేందుకు ఈడీకి అభ్యంతరాలు లేవని ఆయన తెలపడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ సింగ్ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగించవచ్చని, అయితే, ఈ కేసుకు సంబంధించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ట్రయల్ పూర్తయ్యే వరకు సంజయ్ సింగ్ బెయిల్పై ఉంటారని చెప్పిన సుప్రీంకోర్టు.. స్పెషల్ కోర్టు బెయిల్ షరతులకు లోబడి ఉండాలని సంజయ్ సింగ్ను ఆదేశించింది. కాగా, ఈ కేసులో గత ఏడాది అక్టోబరు 4న ఈడీ సంజయ్ సింగ్ను అరెస్టు చేయగా అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.
సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ స్వాగతించింది. దేశ ప్రజాస్వామ్యంలో ఇది గొప్ప రోజని అభిప్రాయపడింది. కోర్టు విచారణలో రెండు ముఖ్యమైన అంశాలు ప్రజల ముందుకు వచ్చాయని ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిశీ పేర్కొన్నారు. డబ్బులకు సంబంధించిన ఆరోపణలపై విచారణ గురించి సుప్రీంకోర్టు ప్రశ్నించినప్పుడు ఈడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఈ కేసు మొత్తం అప్రూవర్ల స్టేట్మెంట్లపై ఆధారపడిందనేది తేటతెల్లమైందన్నారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చేలా అప్రూవర్లను ఒత్తిడికి గురిచేశారని ఆరోపించారు.